Kakani Govardhan Reddy: కూటమి అరాచకాలపై గళమెత్తుతున్న గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు: ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ కార్యకర్తలకు ధైర్యం చెబుతూ ముందుండి నడిపించిన నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అరాచక చర్యలకు వ్యతిరేకంగా ప్రజల తరఫున గళమెత్తుతున్న ఆయన నాయకత్వం ప్రశంసనీయమని అన్నారు.
తిరుపతి పార్లమెంటు పరిధిలోని సర్వేపల్లి నియోజకవర్గంకు సంబంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నెల్లూరు గాంధీనగర్ రోడ్డులోని ఆర్ఎస్ఎన్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు, తిరుపతి పార్లమెంటు పరిశీలకులు మేడా రఘునాథ రెడ్డి, తిరుపతి ఎంపీ మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ కమిటీల టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ మద్దిల గురుమూర్తి, శాసన మండలి సభ్యులు, నెల్లూరు నగర నియోజకవర్గ సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ (జోన్–4) కాకాణి పూజితమ్మ, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వర్ రెడ్డితో పాటు మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వెనకడుగు వేయకుండా పార్టీ కేడర్కు అండగా నిలబడి భరోసా ఇచ్చిన నాయకత్వం కాకాణి గోవర్ధన్ రెడ్డిదేనని అన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న దౌర్జన్యాలు, అక్రమాలపై ప్రజల తరఫున ఆయన నిర్భయంగా పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. అదే కారణంగా ఆయనపై కుట్రపూరితంగా పాత కేసులు, ఎఫ్ఐఆర్లు పెట్టి ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శించారు. అయినప్పటికీ మళ్లీ కార్యకర్తల మధ్యకు వచ్చి ధైర్యం చెప్పడం ఆయన నిజమైన నాయకత్వానికి నిదర్శనమని అన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో గ్రామ కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీ కేడర్కు గుర్తింపు, గౌరవం కల్పించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి కార్యకర్తకు గుర్తింపు కార్డు జారీ చేసి పార్టీకి బలమైన పునాది వేయడమే లక్ష్యమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు సహా ఎలాంటి ఎన్నికలు ఎదురైనా కాకాణి గోవర్ధన్ రెడ్డి మరియు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అందరూ ఐక్యంగా పోరాడాలని ఎంపీ గురుమూర్తి పిలుపునిచ్చారు.
మరిన్ని Andhra Pradesh Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


