Polavaram project Potti Sriramulu: పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలి: నాగబాబు
తెలుగు మాట్లాడే వారిని చులకనగా చూసిన కాలంలో తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కీలక భూమిక పోషించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జీవితం అనేకమందికి ఆదర్శంగా నిలుస్తుందని, అలాంటి మహానుభావుడి పేరు పోలవరం ప్రాజెక్టుకు పెట్టి గౌరవించుకోవాలని జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనను తాము బలంగా సమర్థిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు.
ఆదివారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో జనసేన నేత, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పలువురు ఆర్య వైశ్యులు జనసేన పార్టీలో చేరారు. వీరిని శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారితో కలిసి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పొట్టి శ్రీరాములు జీవితం తరతరాలకు స్ఫూర్తి
ఈ సందర్భంగా నాగబాబు గారు మాట్లాడుతూ…
“ఆర్యవైశ్యులు అనగానే ముందుగా గుర్తొచ్చేది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు. నేను నెల్లూరులో డిగ్రీ చదువుతున్నప్పుడు మా కళాశాలలో ఆయన విగ్రహం ఉండేది. ప్రతిరోజూ ఆయనకు నమస్కరించి తరగతిలోకి అడుగుపెట్టేవాళ్లం. చరిత్ర విద్యార్థిగా ఆయన జీవితం గురించి తెలుసుకున్నాం. ఆయన త్యాగాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం” అని అన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం, గ్రామాల అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి ప్రశంసనీయమని చెప్పారు. గతంలో ప్రభుత్వ పథకాలకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని విస్మరించి, గోదావరి జిల్లాలకు తాగునీరు అందించే ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం ద్వారా ఆయన త్యాగాలను భవిష్యత్ తరాలకు గుర్తుండేలా చేశారని అన్నారు.
పార్టీ మూల సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలి: పిడుగు హరిప్రసాద్
శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు మాట్లాడుతూ…
“ప్రజాసేవే పరమావధిగా జీవించే నాయకుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉంటారు. జనసేన పార్టీని స్థాపించి 14 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, పార్టీ సిద్ధాంతాలను వదలకుండా ముందుకు నడిపించారు” అని అన్నారు.
జనసేన పార్టీ మూల సిద్ధాంతాలకు సప్తాశ్వాలు, సప్తరుషులు, సప్తగిరులకు ఉన్నంత విశిష్టత ఉందని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ ఆ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన వారితో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే శ్రీ కిలారి రోశయ్య సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
మరిన్ని Andhra Pradesh Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


