AP Budget 2026-27: అసెంబ్లీ బడ్జెట్ అనంతరం మీడియా సమావేశం – పర్యాటక రంగానికి బలమైన ప్రోత్సాహం
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం అసెంబ్లీ మీడియా హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిపై కీలక విషయాలు వెల్లడించబడ్డాయి. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ప్రవేశపెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్ అభివృద్ధి దిశగా స్పష్టమైన సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
పర్యాటక మరియు సాంస్కృతిక రంగాల అభివృద్ధి కోసం రూ. 439 కోట్ల కేటాయింపు చేయడం రాష్ట్రానికి శుభసూచకమని తెలిపారు. ఈ నిధులను బ్రాండింగ్, అంతర్జాతీయ ప్రమోషన్, డిజిటల్ మార్కెటింగ్, మెగా ఈవెంట్స్ నిర్వహణ వంటి కార్యక్రమాలకు వినియోగించి ఆంధ్రప్రదేశ్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక టూరిజం బ్రాండ్గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత 2024-29 నూతన పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టి, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ద్వారా పెట్టుబడులకు విస్తృత అవకాశాలు సృష్టించామని చెప్పారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన రోడ్ షోలు, ఇన్వెస్టర్ సమ్మిట్ల ద్వారా 117 ఎంవోయూల ద్వారా రూ. 20,088 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, దీని ద్వారా 1,22,637 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే మార్గం సుగమమైందని తెలిపారు. ప్రస్తుతం రూ. 6,681 కోట్ల ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా రాష్ట్రానికి బలాన్నిస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మద్దతుతో, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారి సహకారంతో 8 ప్రాజెక్టులకు రూ. 428 కోట్ల కేంద్ర గ్రాంట్ మంజూరైనట్లు తెలిపారు.
రాష్ట్రంలో పర్యాటకులు ఎక్కువ రోజులు గడపడానికి అనువుగా విశాఖపట్నం, అరకు, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి ప్రాంతాల్లో 7 యాంకర్ హబ్ల అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. హోటల్స్, రిసార్ట్స్, వెల్నెస్ సెంటర్లు, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఎకో టూరిజం రంగాల్లో పెట్టుబడులు పెంపొందించి పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ‘గ్రోత్ ఇంజిన్’గా మలచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాబోయే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 50,000 అదనపు గదుల లభ్యత కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అలాగే 2027 గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ముందస్తు ఏర్పాట్లకు రూ. 60 కోట్లు కేటాయించామని, కేంద్ర సహకారంతో ఈ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు చేర్చేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


