New Railway Projects AP: నూతన రైల్వే ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష
అమరావతి: రాష్ట్రంలోని నూతన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమీక్షలో రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి రైల్ కనెక్టివిటీ, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన హింటర్ల్యాండ్ ప్రాంతాల నుంచి రైల్ రవాణా విస్తరణపై ముఖ్యమంత్రి సమీక్షించారు. అలాగే రాయలసీమ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాలకు మెరుగైన రైల్ కనెక్టివిటీ కల్పించే ప్రణాళికలపై చర్చించారు.
హైదరాబాద్–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు రైల్వే మార్గాలను హైస్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ధి చేసే అంశాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వాణిజ్యం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
అలాగే విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్, గుంటూరు, రేణిగుంట తదితర ప్రధాన రైల్వే జంక్షన్లలో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, సరుకు రవాణా సామర్థ్యం పెంచేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొని ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, భవిష్యత్ కార్యాచరణపై వివరాలు సమర్పించారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


