Red Sandalwood Smuggling: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముజామిల్ అరెస్ట్ – అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వ ఉక్కు పాదం
చిత్తూరు: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లు మరియు వారి వెనుక ఉన్న కింగ్పిన్స్పై ఉక్కు పాదం మోపాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (ncbn) గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం కీలక విజయం సాధించింది.
అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న మొహమ్మద్ ముజామిల్ అనే కింగ్పిన్ను యాంటి రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ బృందం అరెస్టు చేసింది. లైసెన్స్ పేర్లు ఉపయోగించి ఎర్రచందనం దుంగలను అక్రమంగా చైనాకు తరలించే ముఠాకు ఇతడు కీలక నేతగా వ్యవహరిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. శేషాచలం ప్రాంతం నుంచి బెంగళూరు మీదుగా ఎర్రచందనం రవాణా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
ముజామిల్పై ఇప్పటికే పలు కేసులు నమోదై ఉండగా, వాటిలో 87 శాతం కేసుల్లో శిక్షలు కూడా ఖరారయ్యాయి. అయినప్పటికీ కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. శనివారం ఉదయం చిత్తూరు – నాయుడుపేట జాతీయ రహదారిపై, అడిషనల్ ఎస్పీ శ్రీ కులశేఖర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసింది. విచారణలో అతడికి చైనాలోని జైమెన్ టాంగాంగ్ ఫాంగ్ ట్రేడ్ కంపెనీతో సంబంధాలు ఉన్నట్టు వెల్లడైంది.
ఉప ముఖ్యమంత్రి, అటవీ & పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ (@PawanKalyan) ఆదేశాల మేరకు కింగ్పిన్స్ వేటకు టాస్క్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఇటీవల చిత్తూరు జిల్లా పర్యటనలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, “ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే కింగ్పిన్స్ ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు. ఏ మూలన దాగి ఉన్నా పట్టుకుంటాం” అంటూ హెచ్చరించారు. ఆ హెచ్చరికకు అనుగుణంగానే ఈ ఆపరేషన్ ప్రారంభమై తొలి విజయాన్ని నమోదు చేసింది.
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో ఇది కీలక అడుగుగా అధికారులు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో పాల్గొని సమర్థంగా పని చేసిన టాస్క్ ఫోర్స్ హెడ్ ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీ శ్రీ కులశేఖర్తో పాటు ఇతర అధికారులు, సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


