Protection of Mother Earth: ఉద్యాన సాగుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి
భూమిని కాపాడుకుంటూ రైతుల ఆదాయం పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉద్యాన సాగులో వైవిధ్యం తీసుకురావడం ద్వారా భూమికి రక్షణ కల్పించడంతో పాటు రైతులకు అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధనకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఉద్యాన పంటల సాగులో వైవిధ్యం తీసుకురావడం ద్వారా భూసారం పెరుగుతుందని, జీవవైవిధ్యానికి రక్షణ కలుగుతుందని అన్నారు. ఒకే పంటలో విభిన్న రకాల జాతులను అంతర పంటలుగా సాగు చేయాలని రైతులను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే సింథటిక్ రసాయన మందుల వినియోగాన్ని తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రీన్ కవర్ పెంపులో ఉద్యాన శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, అటవీ శాఖతో పాటు ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో ఈ లక్ష్యాలను సాధించవచ్చని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉద్యాన సాగు విధానాలను అభివృద్ధి చేస్తే భూ మాత రక్షణతో పాటు వ్యవసాయ రంగంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్, రైతు సాధికారిత సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్, నాచురల్ ఫార్మింగ్ సొసైటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, పీసీసీఎఫ్ శ్రీ పి.వి. చలపతిరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


