మేడారం జాతర ఏర్పాట్లు అభినందనీయం: భక్తుల హర్షం
తక్కువ సమయంలో దర్శనం… సాఫీగా సాగుతున్న మహాజాతర
మేడారం / ములుగు జిల్లా: సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతర సందర్భంగా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చేపట్టిన విస్తృత ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మేడారంలో తక్కువ సమయంలో దర్శనం జరుగుతుండటంతో పాటు, భారీ రద్దీ ఉన్నప్పటికీ ఎక్కడా తొక్కిసలాటలు లేకుండా, క్యూ లైన్లలో ఇబ్బందులు లేకుండా దర్శనం సాఫీగా సాగుతోందని భక్తులు పేర్కొంటున్నారు.
క్రమపద్ధతిలో ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, పోలీసులు మరియు వాలంటీర్లు నిరంతరం భక్తులకు మార్గనిర్దేశం చేయడంతో దర్శనానికి ఎక్కువ సమయం పట్టడం లేదని తెలిపారు. గత జాతరలతో పోలిస్తే ఈసారి ఏర్పాట్లు మరింత మెరుగ్గా ఉన్నాయని, స్వల్ప వ్యవధిలోనే అమ్మవారి దర్శనం పూర్తవుతోందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మేడారం చేరే రహదారులు వెడల్పుగా, సౌకర్యవంతంగా ఉండటంతో వాహనాల రాకపోకలు సులభంగా సాగుతున్నాయని, ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గాయని భక్తులు తెలిపారు. అలాగే పార్కింగ్ ప్రాంతాల నుంచి గద్దెల వరకు స్పష్టమైన దారి సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో దారి తప్పే పరిస్థితి లేకుండా ఉందని పేర్కొన్నారు.
భారీగా భక్తులు తరలివస్తున్నప్పటికీ వైద్య సేవలు, తాగునీటి సౌకర్యాలు, పరిశుభ్రత, భద్రతా చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయని భక్తులు ప్రశంసించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా వైద్య సిబ్బంది, అంబులెన్సులు అందుబాటులో ఉండటం భక్తులకు భరోసానిస్తోందని తెలిపారు.
మొత్తంగా భక్తుల సౌకర్యాన్ని ప్రధానంగా తీసుకుని ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లు ప్రశంసనీయమని, మేడారం జాతర ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో సాగుతోందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని National News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


