Hitech City Traffic Plan: హైటెక్ సిటీ ట్రాఫిక్ కష్టాలకు యాక్షన్ ప్లాన్
హైదరాబాద్: మాదాపూర్–హైటెక్ సిటీ ప్రాంతాల్లో రోజుకు లక్షా ముప్పై వేల మందికి పైగా ప్రయాణించే నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు ఐదు శాఖల ఆధ్వర్యంలో సంయుక్త కార్యాచరణ ప్రారంభమైంది. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ, ఏసీపీ, జోనల్ కమిషనర్ హేమంత్ తదితరులు కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు.
లెమన్ ట్రీ హోటల్ నుంచి ట్రిడెంట్ హోటల్, అక్కడి నుంచి శిల్పారామం వరకు రోడ్డు విస్తరణ పనుల పురోగతిని అధికారులు సమీక్షించారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఎయిర్ వాల్వ్లు, ఎలక్ట్రిక్ పోల్స్ను తరలించే అంశంపై చర్చించారు. హైటెక్ సిటీ నుంచి మెడికవర్ ఆసుపత్రి వరకు చేపట్టాల్సిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
పనులు పూర్తయితే మాదాపూర్, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు తెలిపారు.
దుర్గం చెరువు పరిరక్షణకు చర్యలు
దుర్గం చెరువులో మురుగు నీరు చేరకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ సంతోష్, మున్సిపల్, హెచ్ఎండీఏ, లేక్స్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్త తనిఖీ నిర్వహించారు.
మాదాపూర్, సైలెంట్ వాలీ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని దుర్గం చెరువులో నిర్మించిన రెండు ఎస్టీపీల (5 & 7 MLD) ద్వారా శుద్ధి చేస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని చెరువులోకి విడుదల చేసి భూగర్భ జలాల స్థాయిని కాపాడుతున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి అధికంగా వచ్చే మురుగునీరు చెరువులో కలవకుండా 1000 ఎంఎం వ్యాసార్థం పైపులైన్ నిర్మాణ పనులు మాదాపూర్ పెట్రోల్ బంక్ నుంచి ఐ&డి వరకు కొనసాగుతున్నాయి. పైపులైన్ పూర్తయితే లేక్ పార్క్లో సీవరేజ్ ఓవర్ఫ్లో సమస్య తగ్గనుంది.
రహేజా మైండ్ స్పేస్ ప్రాంతాల్లో నిర్మాణ, గార్డెనింగ్, ల్యాండ్స్కేపింగ్ పనులకు ఎస్టీపీలో శుద్ధి చేసిన రీసైకిల్ నీటినే వాడాలని జలమండలి ఎండీ ఆదేశించారు. దుర్గం చెరువు ఎస్టీపీ నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా ట్రీటెడ్ వాటర్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జలమండలి సీజీఎంలు పద్మజ, వాస సత్యనారాయణ, మున్సిపల్, ఇరిగేషన్, టీజీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


