Hydra Hyderabad: రూ. 2200 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా | 11 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
హైదరాబాద్: మాధాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలో హైడ్రా గురువారం భారీ ఆపరేషన్ నిర్వహించింది. మొండికుంట చెరువుతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిపై జరిగిన ఆక్రమణలను తొలగించి 11 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ భూమి విలువ సుమారు రూ. 2200 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని సర్వే నంబర్ 53లోని మొండికుంట చెరువు, సర్వే నంబర్ 55లోని ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైందని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
దాదాపు 11 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆలయాన్ని హద్దుగా చూపించి కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడినట్లు నిర్ధారించారు. 30కి పైగా షాపులు, మెకానిక్ షెడ్లు, ఐరన్ స్టీల్ దుకాణాలు ఏర్పాటు చేసి నెలకు లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది.
వందల సంఖ్యలో తాత్కాలిక షెడ్లు, పలు దుకాణాలను భారీ బందోబస్తు మధ్య హైడ్రా తొలగించింది. మొండికుంట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి చెరువును రక్షించే చర్యలు చేపట్టింది.
సమావేశపరిచి… సమాచారం ఇచ్చి…
మొండికుంటతో పాటు ప్రభుత్వ భూమి ఆక్రమణలపై జనవరి 31న హైడ్రా విచారణ నిర్వహించింది. రెవెన్యూ అధికారులు, కబ్జాదారులు సమావేశంలో పాల్గొన్నారు. ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ చిత్రాలను పరిశీలించి ఆక్రమణలు జరిగినట్లు నిర్ధారించారు. ఇదే విషయాన్ని కబ్జాదారులకు తెలియజేసి కొంత గడువు ఇచ్చిన తర్వాత గురువారం ఆక్రమణల తొలగింపు చేపట్టారు.
ఆపరేషన్ సమయంలో స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి హైడ్రా చర్యలను అభినందించారు. మొండికుంట చెరువును కాపాడినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఆక్రమణలు తొలగించిన ప్రభుత్వ భూమిలో పార్కులు అభివృద్ధి చేయాలని, చెరువును సుందరీకరించాలని స్థానికులు అధికారులను కోరారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


