BRS Sarpanches: మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో బీఆర్ఎస్ గెలుపొందిన సర్పంచ్లు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం – కేటీఆర్
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్లు, వార్డు సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు.
ఈ సమావేశంలో కేటీఆర్ గారు మాట్లాడుతూ, తాను గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేస్తూ, 2014కు ముందు మహబూబ్నగర్ పట్టణం ఎలా ఉండేదో, ప్రస్తుతం ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని అన్నారు. మహబూబ్నగర్ మాత్రమే కాకుండా నారాయణపేట, వనపర్తి, నాగర్కర్నూల్, గద్వాల్ తదితర జిల్లాల పట్టణాలు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో విస్తృతంగా అభివృద్ధి చెందినట్లు తెలిపారు.
పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పల్లె–పట్టణం అనే తేడా లేకుండా అభివృద్ధి చేశామని, అన్ని గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా కొత్తగా ఒక్క అభివృద్ధి పనికీ శ్రీకారం చుట్టలేదని విమర్శించారు. కేసీఆర్ గారి పాలనలో గ్రామాల్లో నీటి ట్యాంకర్లు, ట్రాక్టర్లు, ఇంటింటికి నల్లా, వీధి దీపాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో ట్యాంకర్లలో నీళ్లు లేవని, ట్రాక్టర్లకు డీజిల్ లేదని, వీధుల్లో లైట్లు వెలగడం లేదని కేటీఆర్ గారు తీవ్రంగా విమర్శించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


