State Election Commissioner Rani Kumudini: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష
ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన 2వ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు జాబితాల తయారీ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మ్యాపింగ్ అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్), ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జగిత్యాల కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ, ఖచ్చితమైన, తప్పులేని ఓటరు జాబితాల తయారీ ఎన్నికల విజయానికి మూలాధారం అని పేర్కొన్నారు. నిర్దేశించిన మార్గదర్శకాలు, కాలపట్టికలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హత గల కొత్త ఓటర్ల చేర్పుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, డూప్లికేట్ మరియు అనర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపుపై సమగ్రంగా పరిశీలించాలని సూచించారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత అత్యంత ముఖ్యమని కమిషనర్ స్పష్టం చేశారు. ఎన్నికల యంత్రాంగం, మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్లకు సంబంధించి తాజా ఓటరు డేటాను వినియోగించాలని, అవసరమైన చోట్ల పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ చేయాలని సూచించారు.
ఓటరు జాబితాల తయారీ సమయంలో వచ్చిన ఫిర్యాదులను సమయానికి పరిష్కరించాలని, ప్రజలకు అవసరమైన అన్ని చట్టబద్ధ ఫారములు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఓటర్లలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
అలాగే,
12-01-2026 న తెలంగాణ పురపాలక చట్టం–2019 లోని సెక్షన్ 195-ఎ ప్రకారం వార్డు వారీగా ఫోటో ఓటర్ల జాబితాల ప్రచురణ,
13-01-2026 న పోలింగ్ కేంద్రాల జాబితా ముసాయిదా ప్రచురణ చేసి Te-Pollలో అప్లోడ్ చేయడం,
16-01-2026 న తుది పోలింగ్ కేంద్రాల జాబితా మరియు పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటో ఓటర్ల జాబితాల ప్రచురణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ వ్యాఖ్యలు
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 229 అభ్యంతరాలు అందాయని తెలిపారు. వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి న్యాయంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పోలింగ్ సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు నియామకం, శిక్షణ, డిస్ట్రిబ్యూషన్ & రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటు, కౌంటింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ స్టేషన్ల వద్ద మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల కోడ్ అమలు, ఓటర్ల అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
జిల్లా నోడల్ అధికారులు, ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్ రెడ్డి, శ్రీనివాస్, జెడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి, డిప్యూటీ సీఈవో పి. నరేష్, డీపీవో మదన్ మోహన్, జిల్లా నోడల్ అధికారులు, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


