Telangana High Court: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదని స్వయంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ప్రకటించిన తర్వాత కూడా ధరల పెంపుకు సంబంధించిన మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారని అధికారులను హైకోర్టు నిలదీసింది.
టికెట్ రేట్లు పెంచబోమని స్పష్టంగా చెప్పినా, అధికారులు తెలివిగా మెమోలు జారీ చేస్తూ వ్యవహరిస్తున్నారా అంటూ ప్రభుత్వ న్యాయవాదిని (జీపీ) కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారుల ఆలోచనా ధోరణి ఎందుకు మారడం లేదని ఆక్షేపించింది.
మెమోలు జారీ చేస్తున్న అధికారులకు నిబంధనలు తెలియవా? లేక ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారా? అంటూ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ విధానానికి విరుద్ధంగా వ్యవహరించే అధికారుల చర్యలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ఈ వ్యవహారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇలాంటి గందరగోళ నిర్ణయాలతో ప్రజలను అయోమయానికి గురిచేయొద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


