పర్యాటకమే భారత సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే శక్తివంతమైన మార్గం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప సాధనం పర్యాటక రంగమేనని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో, పర్యాటకం ద్వారా సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలపై అవగాహన పెరుగుతుందని, అదే సమయంలో ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి, ప్రాంతీయ అభివృద్ధి, జాతీయ ప్రతిష్ఠ పెంపుదలతో పాటు ప్రకృతి సంరక్షణకు కూడా పర్యాటక రంగం కీలకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
దేశంలో తెలంగాణను అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ టూరిజం పాలసీ – 2025–30ను ప్రభుత్వం ప్రకటించిందని సీఎం గుర్తుచేశారు. ఈ పాలసీ ద్వారా ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక, సాహస, వైద్య & వెల్నెస్, పర్యావరణ పర్యాటక రంగాల అభివృద్ధి ద్వారా పర్యాటకులను, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమన్నారు.
సురక్షిత పర్యాటకం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన, అవకాశాలున్న ప్రాంతాలను ప్రత్యేక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా #TelanganaTourismPolicy రూపొందించామని తెలిపారు. తెలంగాణలోని ప్రసిద్ధ స్మారక చిహ్నాలు, చారిత్రక ప్రదేశాలు, పవిత్ర పుణ్యక్షేత్రాల వైభవంతో పాటు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే ఉత్సవాలు, సంప్రదాయ వంటకాలు, హస్తకళలు తెలంగాణ ప్రత్యేకతను చాటుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


