Madhira Municipality: మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో పోటీ
మధిర మున్సిపాలిటీలో నిబద్ధతతో ప్రజాసేవ చేయడానికి జనసేన పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. మధిర మున్సిపాలిటీలోని అన్ని 22 వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు.
రాజకీయంగా చైతన్యవంతమైన మధిర ప్రాంతంలో ప్రస్తుతం రౌడీయిజం, గంజాయి మాఫియా రాజ్యమేలుతోందని, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా మధిర పారిశ్రామిక అభివృద్ధికి దూరంగా ఉందని, వందల కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపనలు జరిగినా, ప్రారంభోత్సవాలు మాత్రం కనిపించడం లేదని విమర్శించారు.
మధిరలో ప్రజా సమస్యలపై పోరాటం చేసే బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే మధిర కేంద్రానికి విజయవాడ, ఖమ్మం నుంచి సరైన రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
యువత, విద్యావేత్తలు, సామాజిక సేవ చేసే వారికి రాజకీయాల్లో అవకాశం కల్పించడమే జనసేన పార్టీ లక్ష్యమని, అందుకే మధిర మున్సిపాలిటీ ఎన్నికల కోసం 22 వార్డులకు గాను 50 దరఖాస్తులు రావడం ప్రజల్లో జనసేనపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు.
మధిర మున్సిపాలిటీ నిజంగా అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడి, నిబద్ధతతో ప్రజాసేవ చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ విషయాలను మధిర ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ వెల్లడించారు. ఈ సమావేశంలో మధిర జనసేన పార్టీ నాయకులు మోదుగు రమ్య, అనంత శివరామకృష్ణ, తాళ్లూరి డేవిడ్, అనుమొల నరేష్, మందడపు రామకృష్ణ, దీపకళ, సాయితేజ, పవన్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


