Janasena Party: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ పోటీ
జరుగనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ మంతెన సంపత్ కుమార్ తెలిపారు. ఆదివారం క్యాతనపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు.
ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ, సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో జనసేన పార్టీకి ప్రజల్లో విస్తృత ఆదరణ ఉందని పేర్కొన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసైనికులకు టికెట్లు ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం సన్నద్ధమవుతోందని తెలిపారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో పోటీ చేసేందుకే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆదిలాబాద్ జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశామని, జనసైనికులకు టికెట్లు ఇచ్చే విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు.
ఎన్నికల్లో యువతకు, మహిళలకు జనసేన పార్టీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డు స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని, ఈ ఎన్నికల్లో అన్ని 22 స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
జనసైనికులను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దే అవకాశం తమకు లభించిందని, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బలాన్ని నిరూపిస్తామని మంతెన సంపత్ కుమార్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జనసేన రాష్ట్ర యూత్ అడహాక్ కమిటీ సభ్యుడు మాయ రమేష్, విద్యార్థి విభాగం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆవుల సాగర్, పిట్టల సుధాకర్, క్యాతనపల్లి నాయకులు ఆర్షణపల్లి చరణ్ కుమార్, వాసలా అజయ్ కుమార్, మనక రాకేష్, వెంగల శ్రీనివాస్, బోయిని జగదేశ్వర్, మేకల పవన్ కళ్యాణ్, రమేష్, పవన్, వరుణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


